31, జులై 2013, బుధవారం

ప్రథమస్కంధం: 07. శ్రీవేదవ్యాసులవారు భాగవతం విరచించుట.

భగవంతుడైన నారదుడు ఇలా తన పూర్వజన్మవృత్తాంతం వ్యాసులవారికి తెలియజేసి వెళ్ళారని సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతూ అయనొక మాట అన్నారు.

క. వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతములు జగములకుం
జేయించు జెవులపండువు
మాయించు నఘాళి నిట్టి మతి గలఁడే

నారదులవారు నిత్యం మనోహరంగా వీణావాదనం చేస్తూ నారాయణుడి మీద కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ గీతాలు చెవులకు పండుగ చేస్తూ ఉంటాయి. అవి వినే వాళ్ళ పాపాలన్నీ‌ తొలగిస్తూ ఉంటాయి. ఆహా. నారదులవారి వంటి మహానుభావులెవరూ ఉండరు!

అప్పుడు శౌనకమహర్షి, బాదరాయణుడు (వ్యాసుడు) ఆ తర్వాత ఏమి చేసారూ‌ అని ప్రశ్న వేయగా సూతులవారు చెబుతున్నారు.

సరస్వతీనదికి పడమటితీరంలో ఋషులకు మిక్కిలి ఇష్టమైన శయ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది.  వేదవ్యాసులు అక్కడకు వెళ్ళారు. 

పరిపూర్ణమైన భక్తితో ఈశ్వరుని భావనలో దర్శించారు.  ఈశ్వరుడి ఆధీనంలో ఉంటుంది మాయ. ఆ మాయలో పడి మోహంతో జీవులంతా నిత్యం జననమరణ చక్రంలో‌ పరిభ్రమిస్తూ ఉంటారు.  నిజానికి ప్రతిజీవుడూ ఈశ్వరాంశయే.  ఈశ్వరుని వలే జీవుడూ త్రిగుణాలకు అతీతుడే.  కాని ఎప్పుడైతే, మాయ యొక్క ప్రభావంలో‌ పడ్డాడో, అప్పుడే జీవుడు తనకు ఈ సత్వరజస్తమో గుణాలు మూడూ సహజంగా ఉన్నాయని భ్రమపడతాడు.  ఈ‌ గుణాలపట్ల అభిమానం కలిగి ప్రవర్తిస్తాడు.  దానితో‌ తాను కర్మలు చేసేవాడూ వాటిఫలాలు పొందేవాడూ‌ అవుతున్నాడు.  జీవుడికి ఈ కర్తృనూ‌ భోక్తనూ అన్న తప్పుడు స్పృహ పోవాలీ‌ అంటే నారాయణ భక్తి అనే యోగం తప్ప వేరే దారి లేదు.  ఇదంతా చక్కగా విచారించి వ్యాసభగవానులు భాగవత మహాగ్రంథాన్ని నిర్మించారు.  దానిని మోక్షార్థి ఐన తన పుత్రుడు శుకమహర్షిచేత చదివించారు.

సూతుడు ఇలా చెప్పగా విని  శౌనకమహర్షికి ఆశ్చర్యం వేసింది.  అదేమిటి మహాత్మా,  నిత్యం మోక్షస్థితిలో ఉండేవాడూ, ప్రపంచాన్ని సాక్షిమాత్రంగా చూస్తూ ఉండేవాడూ అయిన శుకయోగీంద్రుడికి భాగవతం‌ అభ్యసించవలసిన పనేమిటీ అని ఆడిగారు.  దానికి సూతుడి సమాధానం ఏమిటంటే

ధీరులూ, దేనిమీదా ఆపేక్షలేనివారూ, ఆత్మారాములూ అయిన మునులు హరిభజన చేయటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ‌ అవసరం లేదయ్యా.  అది వారి స్వభావం.  అదే నారాయణుడి స్వభావం.  దేనినైనా కోరి హరిభజనం చేయటం కామ్యకర్మం కాబట్టి అది కల్యాణస్వరూపమైన ముక్తిని ఇవ్వదు. అందుచేత

క. హరిగుణ వర్ణన రతుఁడై
హరితత్పరుడైన బాదరాయణి శుభత
త్పరతం‌ బఠించె త్రిజగ
ద్వర మంగళ మైన భాగవత నిగమంబున్

శుకయోగీంద్రుడు, శ్రీమహావిష్ణువు గుణవర్ణనం పట్ల మిక్కిలి ఆసక్తి కలవాడై,  ఆ విష్ణువునందే పరమ నిష్ఠ కలవాడై, పరమశుభమైన మోక్షం‌ పట్ల నిలకడ కలవాడై, ముల్లోకాలకూ మంగళప్రదమైన భాగవతం అనే వేదాన్ని అభ్యసించాడు.

క.  నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా

ఓ‌ మహర్షులారా, అనంతా వై వేదాః అని వేదాలు వేయింటిని చదివినా ముక్తి సులభం కాదు సుమా.భాగవతం అనే వేదం చదివిన వారికి మాత్రం అది సులభం.  భాగవతం చదివిన వారు నిత్యం ముక్తులయే ఉంటారు.

ఇక మీరడిగిన పరీక్షిత్తు కథలోకి వద్దాం అని సూతపౌరాణికుడు అన్నాడు.

30, జులై 2013, మంగళవారం

ప్రథమస్కంధం: 06. శ్రీనారదమహర్షులవారి పూర్వజన్మవృత్తాంతం

శ్రీవేదవ్యాసమహర్షి కొద్ది సేపు నారదులవారి ఉపదేశాన్ని మననం చేసుకుంటూ ఉండిపోయారు. అంతసేపూ శ్రీనారదులవారు తమ మహతీవీణ తోడుగా సన్నగా నారాయణనామగానం చేస్తూ ఉన్నారు.

మెల్లగా వ్యాసులవారి హృదయం తేలికపడింది. కర్తవ్యం వారికి పూర్తిగా అవగతం కావటంతో సంతోషం కలిగింది.

మెల్లగా వ్యాసులవారు భావనాప్రపంచం నుండి ఇహప్రపంచం లోనికి తిరిగి వచ్చాక శ్రీనారదులవారు తిరిగి తమప్రసంగం‌ కొనసాగించారు.

వ్యాసా, తరచుగా భగవంతుడైన శ్రీహరిని గురించి ప్రసంగించటం నాకు సంతోషం కలిగిస్తుంది.  అయితే ఇలా ప్రసంగించే అధికారం శ్రీహరి నాకు పరమప్రేమతో అనుగ్రహం చేయటానికి పూర్వరంగం నీకు చెప్పాలనే సంకల్పం‌ కలిగింది నాకు.  అంటే నా పూర్వజన్మకు సంబంధించిన కథ అన్నమాట.

ఇది,  అంటే నా పూర్వజన్మ,  ఈ‌ శ్వేతవరాహకల్పం లోనిదే కాదు.  అంతకు ముందు జరిగిన లక్ష్మీకల్పం లోనిది.

నేను అప్పుడు ఒక పనిమనిషి కొడుకుని.  మా అమ్మకు నేను ఒక్కడినే బిడ్డను. నా యందు ఆమెకు వల్లమాలిన ప్రేమ.  చిన్నవాడినైన నన్ను ఒంటరిగా ఇంట్లో విడిచి పెట్టలేక, తనతో పాటే తన యజమానుల ఇంటికి కూడా తీసుకొని వెళ్ళేది మా అమ్మ.

మా యజమాను లెవరను కున్నావు.  వారు గొప్ప వేదవాదులు.  నిత్యం వేదాధ్యయనం చేస్తూ, శిష్యులకు వేదం చెబుతూ, యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవారు మా యజమానులు.

చిన్నపిల్లవాడినైన నేనూ మా అమ్మకు వీలయినంతగా సహాయం‌చేస్తూ, ఇంట్లో వారికి కూడా ప్రీతి పాత్రుడుగా ఉండే వాడిని.

ఒకసారి మా యజమానుల ఇంటికి కొందరు గొప్ప యతీశ్వరులు వచ్చారు. వారు వచ్చింది చాతుర్మాస్యం (అంటే వానాకాలం నాలుగు నెలలు) మా యింట జరుపుకుందుకు.  మా యజమానులు వారికి తగిన వసతులు ఏర్పాటు చేసారు.  వారికి సేవచేయటానికి నన్ను ఆజ్ఞాపించారు.

వారి ప్రవర్తన కుర్రవాడినైన నాకు చిత్రంగా అనిపించి బాగా ఆకర్షించింది. వాళ్ళు నిత్యం శ్రీహరిని గూర్చి ప్రసంగించుకుంటూ, పాటలు పాడుకుంటూ, హరినామ జపం చేసుకుంటూ ఉండే వారు. 

నేను ఆ యతుల్ని పరమభక్తితో సేవించాను. బాల్యచేష్టలైన ఆటపాటలు వదిలిపెట్టేసాను. వారు చెప్పేపనులు ఎండావానా అనక ఓపిగ్గా చేసేవాడిని. వారు నాకు ఏదైన అనుగ్రహిస్తే తినటానికి అది ఎంగిలి అయినా సరే పరమపవిత్రం అనే‌ భావనతో ఆనందంగా స్వీకరించేవాడిని.

శా. వారల్ కృష్ణుచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగా బాడఁగా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణ మైన మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభదూరుండనై

ఆ యతీశ్వరులు అలా శ్రీహరి కథలు చదువుతూ, వాటిని యథాశక్తి వర్ణిస్తూ, శ్రావ్యంగా మైమరచి పాటలుగా పాడుతూ ఉంటే అదంతా నాకు అమృతరసప్రవాహంలా తోచేది. నా మనస్సుకు పరిపూర్ణమైన ఆనందం కలిగేది.  దానితో‌ నేను కూడా అప్రయత్నంగా మనస్ఫూర్తిగా విష్ణుసేవ మొదలు పెట్టాను. ఇతరమైన సర్వవిషయాలూ వెనుకకు నెట్టి వేసాను.

ఆ హరిసేవాభాగ్యం వలన నేను ప్రపంచానికి అతీతమైన పరబ్రహ్మతత్వం తెలుసుకోగలిగాను. ఈ‌ కనిపించే‌ దేహమే కాక దానిలో ఒక సూక్ష్మదేహం ఉందని అర్థమైంది.  ఈ‌ రెండు దేహాల వంటి వ్యవహారాలన్నీ ప్రకృతిమాయచే జీవుడనైన నేనే స్వయంగా కల్పించుకున్నానన్న సంగతి బోధపడింది. ఆ మహానుభావుల సాహచర్యం కారణంగా నాకు కలిగిన హరిభక్తి నాలోని రజోగుణాన్నీ తమోగుణ్నాన్నీ‌ సమూలంగా అణచి వేసింది.

అంతలోనే నేను ప్రీతితో సేవించుకుంటున్న యతీశ్వరుల చాతుర్మాస్యదీక్ష ముగిసింది.  నా యోగ్యతనూ, హరిభక్తినీ గమనించిన వారికి నా యందు మిక్కిలి ప్రేమభావం కలిగింది. అందుచేత వారు మా యజమానుల ఇంటిని విడిచి వెళ్ళే ముందు నాకు ఈశ్వరతత్వం గురించి చక్కగా ఉపదేశం చేసారు.

దానితో నాకు శ్రీహరి యొక్క మాయ గురించిన విజ్ఞానం కలిగింది. వాసుదేవునికి అర్పించిన కర్మము అన్ని తాపత్రయాలను మాన్పే మందు అని బోధపడింది.  దేని వలన రోగం వస్తుందో  దాన్ని మనం ఏ మోతాదులో సేవించినా అది మనకు రోగనివారణ చేయదు కదా. మరొక పదార్థమే ఆ రోగాన్ని కుదర్చాలి.  ఈ‌ ప్రపంచంలో మనని బంధించి ఉంచేవి కర్మలు.  ఆ కర్మలు ఎలా చేసినా ఏవి చేసినా అవి సంసారంలోంచి మనని బయటపడ వేయ లేవు.  దానికి  ఈశ్వరుడనే వైద్యుడు జ్ఞానం అనే మందు వేయవలసినదే. అన్ని కర్మలనూ ఈశ్వరుడికి అర్పించి వేయాలి. అప్పుడు ఈశ్వరుడు సంతోషించి మనకు తనయందు భక్తి కలిగిస్తాడు.  ఈశ్వరుడే మనకి కర్మబంధాలనుండి తప్పించే‌ జ్ఞానం అనుగ్రహిస్తాడు.  నిత్యం‌ భగవంతుని నామాలను ఓంకారపూర్వకంగా ధ్యానించాలి.  యతీశ్వరుల పుణ్యమా అని నాకు ఇదంతా బోధపడింది.

నేను కూడా అలా హరిని ఆరాధించటంతో ఆయన దయతో నాకు విజ్ఞానాన్ని ప్రసాదించాడు.   ఓ‌ వ్యాసా, నువ్వు కూడా అలాగే చేయవయ్యా.

అలా శ్రీనారదులవారు చెప్పగానే శ్రీవ్యాసులవారు ఒక ప్రశ్నవేశారు.  నారదమహర్షీ ఆ తరువాత ఏమి జరిగింది?  ఆనాటి జన్మలో పెరిగి పెద్దవారై ఎలా ప్రవర్తించారు? అసలు ఆ జన్మకు సంబంధించిన స్మృతి అంతా తమకు ఇలా విదితంగా ఎలా ఉంది? అని.  దానితో నారదులవారు చెబుతున్నారు, అనంతరకథను.  

వ్యాసా, చెబుతాను విను.  అలా అప్పటికి ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న నాకు హరిభక్తి గొప్ప మేలు చేసింది.  నాకు సంసారంతో‌ సమస్తబంధాలు తెగిపోయాయి.  అలా గని నేను మా అమ్మను విడిచి పెట్టి పోలేదు సుమా! ఆమె తన ప్రాణాలు నా మీదనే నిలుపుకుని ఉన్నదాయె.  నేను తప్ప ఆమెకు వేరు లోకమే లేదన్నట్లుండేది మా అమ్మ.  శ్రీహరి దయతో జ్ఞానినైన నాకు మా అమ్మ ప్రేమ ఒక బంధం కాలేదు.

ఇలా ఉండగా ఒకనాడు మా అమ్మ చీకటి వేళలో‌ పాలు పితకటానికి వెళ్ళి పాముకాటుకి గురియై మరణించింది.  అలా ఆ నామమాత్రపు బంధం కూడా తీరిపోయింది.

ఇక నిశ్చింతగా జనావాసాలకు దూరంగా పోయి విష్ణుధ్యానంలో కాలం గడుపుదామని నిర్ణయించుకున్నాను. ఊరు వదలి, అనేక ఊళ్ళూ, నగరాలూ దాటి, చిన్న చిన్న అడవులు దాటి ఒక కీకారణ్యం చేరుకున్నాను. అక్కడ ఒక జలాశయంలో స్నానం చేసి, దాహంతీర్చుకున్నాను.  ఒక రావిచెట్టు క్రింద కూర్చుని ధ్యానం‌ మొదలు పెట్టాను.

శా. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో దద్పద
ధ్యానారూఢుడ నైన నాతలఁపులో నద్దేవుడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగ లే నైతిన్ ననున్ న్నీశ్వరున్
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక అట్లంతటన్

అలా ధ్యానం చేస్తూ ఉండగా. అపరిమితమైన ఆనందం‌ కారణంగా కళ్ళనుండి ధారాపాతంగా నీళ్ళు ప్రవహించాయి. శరీరంలోని రోమాలన్నీ‌ సంతోషాతిరేకంతో నిక్కపొడుచుకున్నాయి (రోమాలు నిక్కపొడుచుకోవటానికి పురుషుడిపరంగా రోమాంచం అనీ‌ స్త్రీలకైతే పులకరింత అనీ వ్యవహారం).  నిరంతరాయంగా అలా హరిధ్యానం చేస్తూ ఉండగా నా తలంపులో ఆ దేవదేవుడి దివ్యమంగళస్వరూపం గోచరించింది - అదీ‌ తృటి కాలం మాత్రమే.  ఆ పరమానందస్థితిలో మైమరచి ఉన్న నేను ఈశ్వరుణ్ణి గ్రహించలేకపోయాను. 

అయ్యో‌ కానవచ్చిన పరమేశ్వరుడైన శ్రీహరిని తెలుసుకోలేకపోయానే అని పరితపించాను.  ఆ చింతతో మతిస్థిమితం తప్పిన వాడిలాగా అయిపోయి అడవి అంతా తిరుగుతూ యెక్కడున్నావయ్యా ఎక్కడ అని పిలుస్తూ తిరుగుతున్నాను. అప్పుడు కరుణామూర్తి అయిన శ్రీమహావిష్ణువుకు నామీద దయపుట్టింది. ఆ మాటలకందని మహానుభావుడు, దయతో గంభీరంగా మధురంగా ఇలా అన్నాడు

ఉ. ఏల కుమార శోషిలఁగ నీ‌ జననంబున నన్ను గానఁగాఁ
జాలవు నీవు కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ముఁ డైన ముని ముఖ్యుడు గాని కుయోగి గానఁగాఁ
జాలఁడు నీదు కోర్కె కొనసాగుటకై నిజమూర్తి జూపితిన్

నాయనా, ఎందుకు విచారం? ఈ‌ జన్మలో నీవు నన్ను చూడలేవు.  అరిషడ్వర్గాలనూ‌ జయించి కర్మబంధాలు పూర్తిగా తెంచుకున్న యోగి తప్ప మరెవరూ నన్ను చూడలేరు. నీలో ఇంకా నేను అన్నభావన మిగిలే‌ ఉంది. అది కూడా నశించాలి. అయితే నన్ను చేరుకోవాలనే నీ‌ ఆశయం గొప్పది. అందుకోసం నీ ప్రయత్నం కొనసాగవలసి ఉంది.  కాబట్టి ఒకసారి నా నిజస్వరూపం నీకు చూపించాను.

ఒకసారి  నా పట్ల భక్తి కలగాలే కానీ‌ అది ఊరకే పోదు. అన్ని దోషాలనూ కర్మబంధాలనూ నశింపచేస్తుంది. ఇక నీకు కలిగిన ఈ భక్తి తప్పకుండా రాబోయే జన్మలోనూ కొనసాగుతుంది.

ఈ‌ సృష్టి త్వరలో అంతమై పోతుంది. ఆ తరువాత వెయ్యియుగాలపాటు బ్రహ్మకు రాత్రి సమయం.  ఆ తరువాత పునఃసృష్టి.  అందులో నువ్వు ఇంక యే దోషమూ లేని శుధ్ధసాత్విక స్వరూపంతో అవతరిస్తావు. అటువంటి వాళ్ళలో మొదటివాడివీ‌ అవుతావు. 

ఇలా ఆకాశవాణిగా శ్రీహరి పలుకులు విని సంతోషించాను. ఆనందంతో‌ హరినామస్మరణ చేసుకుంటూ కామం‌ క్రోధం వంటి అరిషడ్వర్గాలనూ వదలి పెట్టి నిర్మలమైన బుధ్ధితో కాలం కోసం ఎదురు చూసాను.  కాలం ఆసన్నమైనంతనే, ఆ కర్మస్వరూపమైన శరీరం వదలి, శుధ్ధసత్వస్వరూపమైన దేహం స్వీకరించాను. దానినే భాగవతదేహం అనీ అంటారు. 

అప్పుడు ప్రళయకాలం కాబట్టి నారాయణుడు సకల సృష్టినీ‌ ఉపసంహరించాడు. నేను బ్రహ్మలో ప్రవేశించాను.  ఆ బ్రహ్మ విష్ణువులో ప్రవేశించి నిద్రకు ఉపక్రమించాడు.  మరొక వెయ్యి యుగాల రాత్రికాలం పూర్తి అయ్యాక బ్రహ్మ నిద్రలేచి విస్ణుమూర్తి ఆదేశం మేరకు సృష్టి మొదలు పెట్టాడు.  ఆ బ్రహ్మ నుండి మరీచి మొదలైన సప్తమహర్షులూ నేనూ‌ సంభవించాము.

అఖండబ్రహ్మచర్యవ్రతం పూని విష్ణుదేవుని అనుగ్రహంతో ముల్లోకాల్లోనూ నిరాటంకంగా విష్ణుకీర్తనం చేస్తూ తిరుగుతుంటాను. ఇదిగో ఈ‌ దైవదత్తమైన వీణ నాకు తోడు. ఇందులో సప్తస్వరాలు తమంతతామే‌ కావలసినట్లు పలుకుతాయి.  ఇలా గానం చేస్తూ తిరిగే‌ నా మనస్సులో విస్ణుదేవుడు నిత్యం నాకు గోచరిస్తూనే ఉంటాడు.

ఓ వ్యాసమహర్షీ, సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నవాడికి విష్ణువే తీరానికి చేర్చే‌ నావ.  వేరే దారి అంటూ‌ లేనే లేదు.

చ. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామ రో
షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచే
గ్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల ముని మండన చెప్పితి నీవు కోరినన్

ఆత్మకు యమనియమాదులైన నియమాల వలన జ్ఞానం కలిగినా శాంతి కలగదయ్యా. ఎందుకంటే కామం క్రోధంవంటివి నిత్యం అశాంతిని కలిగిస్తూనే ఉంటాయి కాబట్టి. విష్ణుసేవ వలన ఆ కామక్రోధాదులు అణగి నశించి క్రమంగా శాంతి కలుగుతుంది. నా పూర్వజన్మలో నేను చేసిన భాగవతసేవవంటి పుణ్యకర్మల గురించీ, అప్పటి నా కర్మశరీరం గురించీ నీ‌కు చెప్పాను.  అలాగే విష్ణుకృపవలన నాకు కలిగిన భాగవత దేహం‌ గురించీ‌ నీ‌కు వివరంగా చెప్పాను.  ఓ ముని శ్రేష్ఠుడవైన వ్యాసా, ఈ‌ రహస్యాలన్నీ నీవు అడగ్గానే ప్రేమతో తెలియజెసాను నీకు.  దీని వలన విస్ణుస్వరూపం పైన నీకు పూర్తి అవగాహన కలుగుతుందని భావించి చెప్పాను.

ఇలా కర్తవ్యబోధ చేసి, శ్రీమహావిష్ణుస్వరూపావబోధనం చేసి భగవత్స్వరూపుడైన శ్రీ నారదమహర్షులవారు వ్యాసుని వద్దనుండి బయలుదేరి వెళ్ళారు.

29, జులై 2013, సోమవారం

ప్రథమస్కంధం: 05. నారదులవారు వేదవ్యాసులవారిని భాగవతరచన చేయమని ఆదేశించుట.

శ్రీనారదమునీంద్రులవారు వ్యాసులవారితో ఇంకా యిలా అన్నారు.

వ్యాసమహర్షీ, జ్ఞానం అనేదానికి దేహం అనేదానితో యదార్థంగా ఏ సంబంధమూ లేదు.  అలాగే దేహం ఉన్న కారణంగా దేహస్థుడైన జీవుడు అనేకానేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ‌ కర్మలు వేటితోనూ కూడా జ్ఞానం సంబంధం లేనిదే. అలా జ్ఞానం ఏ విధమైన ఉపాధులూ (అంటే దేహాలూ) కర్మలూ అంటక నిర్మలంగా స్వయం ప్రకాశంగా ఉంటుంది.

అయితే ఈ జ్ఞానం అనేది హరిభక్తి అనేది లేని దేహంలో పెద్దగా శోభించదు!

ఏ‌ పని (కర్మ) చేసినా, దాని ఫలితం ఈశ్వరార్పణం చేయకపోతే అది అప్రశస్తమైన కర్మ అనిపించుకుంటుంది.  ఎందుకంటే, ఫలితాన్ని ఆశించి చేసే అన్ని రకాల కర్మలూ జీవులను బంధించి ఉంచేవే అవుతున్నాయి కదా.

ఈశ్వరభక్తిలేని వాడి వాక్కులయొక్క నేర్పరితనం కేవలం వాగాడంబరం. అలాంటివాడి చేత ఆచరించబడే కర్మలు అన్నీ కేవలం డాంబికాలు. అలా అటువంటివాడు ఈశ్వరుడి చేత అనుగ్రహించబడిన ఉపాధిని దుర్వినియోగం చేస్తున్నట్లవుతున్నది.

అటువంటివాడు వేదాధ్యయనం చేతా, గురుశుశ్రూష చేతా జ్ఞానం సముపార్జించినా అదీ‌ దండగే!  ఈశ్వరార్పణ చేసే మంచి బుధ్ధి లేని కారణంగా అ జ్ఞానం ప్రకాశించదు.

ఈశ్వరార్పణంగా లేని జ్ఞానం కాని, వాక్కులూ, కర్మలూ కాని అలా నిస్ప్రయోజనాలవుతున్నాయి!

వ్యాసా, నువ్వు మహానుభావుడివి. ఎంతో ప్రపంచానుభవమూ తత్వజ్ఞానవివేకమూ గల నీ కిదంతా తెలుసును.   ఉన్నది ఉన్నట్లు సర్వమూ తెలిసినవాడివి.  అందుకే నీకు ప్రపంచంలో గొప్ప కీర్తిప్రతిష్టలు కలిగాయి.

నాకు తెలుసు.  నువ్వు సత్యం మీద నిష్ఠ గలవాడివి. ఆ విషయంలో నీకు గల పట్టుదల అద్వితీయమైనది. 

అందుచేత నువ్వు సకల కర్మ బంధాల నుండీ విడిపించే మహానుభావుడైన శ్రీమహావిష్ణువు యొక్క లీలావిశేషాలను పరమభక్తితో వర్ణించు.ఆ లీలావిశేషాలు ప్రపంచానికి విశదీకరిస్తూ ఒక దివ్యమైన గ్రంథం ప్రకాశింపజేయి.

ఎంతగొప్ప గ్రంథమైనా హరికి సంబంధించిన విశేషాలతో కాక అన్యవ్యవహారాలతో‌ నడిపిస్తే లాభం ఏమిటి? అది కాస్తా అనవసరమైన రకరకాల సిథ్థాంతాల గందరగోళాల్లో ఇరుక్కుంటుంది. తుఫానుల్లో చిక్కుపడ్ద చిన్న నావలాగా అయిపోతుంది. అది అటూ ఇటూ తిరుగుతూ ఒక గమ్యం అంటూ చేరలేదు - అసలు గమ్యం అంటూ దానికి తెలిసే దారే లేదు కదా!

వ్యాసమహర్షీ, నువ్వు నిశ్చయంగా మంచి మంచి విషయాలతోనే అద్భుతమైన గ్రంధాలు తయారు చేసి జనాని కందించావు.  అందులో ఏమీ‌ సందేహం లేదు.  అనేక విధాలుగా ఇలా చెయ్యాలీ, ఇలా చెయ్యకూడదూ అంటూ ధర్మప్రబోధం చేసావు.  అదీ గొప్ప విషయమే.

కాని అమాయకంగా,  ఫలితాలను ఆశించి కర్మలు చేస్తూ బ్రతికే వాళ్ళకు కొత్తగా నువ్వు రకరకాల నియమాలు పెట్టి వాళ్ళను గందరగోళం లోనికి నెట్టివేసావు గదా!  అది మాత్రం ఉచితంగా లేదు.  

సామాన్యజనం ఏం చేస్తారో తెలుసునా వ్యాసా?  వాళ్ళు  నువ్వు చెప్పిన విధి - నిషేధాల స్వరూపంతో అందుకున్న ధర్మాలను పట్టుకుందామని ప్రయత్నిస్తారు. ఎంతోకొంత అందుకోగలిగి, ఆచరణలోకి తెచ్చుకున్న వాళ్ళలో, దాదాపు అందరూ తామేదో సాధించేసామని గర్వంతో మిడిసిపడుతూ ఉంటారు. అవికోరీ ఇవికోరీ కర్మలు ఆచరించేవాళ్ళు ఏదో సాధిస్తున్నా మనుకుంటున్నారు. అదే పారమార్థిక జీవనం అనుకుంటున్నారు.  ఇలా జుగుప్సాకరంగా ధర్మాన్ని అన్వయం చేసుకుంటున్నారు!

ఇక పోతే అలా నువ్వు చెప్పిన ధర్మాలు అర్థం చేసుకోవటమూ అందిపుచ్చుకోవటమూ చేయలేని వాళ్ళు మాత్రం నిరాశానిస్పృహలలో కూరుకు పోతారు.  తమకు అందకుండా పోయిన ధర్మపన్నాలగురించే చింతిస్తూ జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు.

ఇలా రెండు రకాల మనుష్యుల మనస్సులూ‌ కలతచెందుతున్నాయి.  జనం అంతా ఈ‌ విధినిషేధాలు మాత్రమే పరమధర్మం అనుకుంటున్నారు!  ఇలా మనుష్యులందరూ ఈ‌విధులూ నిషేధాలూ కన్నా ఉన్నతమైన తత్వం ఒకటి ఉందనీ, దానిని గూర్చి జ్ఞానం సంపాదించవలసిన అవసరం అనేది ఒకటి ఉందనీ పూర్తిగా మరచి పోతున్నారు!

వ్యాసా, ఇప్పుడు నీ కర్తవ్యం స్పష్టం. మనుష్యుల బుధ్ధికి మోహం కలగకుండా ఆ బుధ్ధులకు తిన్నగా తత్వమార్గం పట్టించేందుకు అవసరమైన మంచి బోధను వారికి అందించటమే అది.

చ. ఎఱిగెఁడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱుంగుఁ దాను మదినేరుపుఁ జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల మునీంద్ర చెప్పుమా

ఓ వ్యాసా, తెలిసినా వాడు సకలకర్మలనూ వదలి వేస్తాడు. ఆ కర్మల స్థానంలో భగవంతుడైన శ్రీహరి స్వరూపాన్ని తనయందు నిండుగా నింపుకొని సంతోషంగా ఉంటాడు.  అతడికి జీవులను బంధించే‌ త్రిగుణాలు కాక హరిగుణాల పట్ల అనురక్తి కలిగి ఉండే‌ నేర్పు వశమై ఉంటుంది.  కాని అందరూ అంత తెలివి గలవారు కారుగదా.  సామాన్యులు మాత్రం, నిర్విరామంగా త్రిగుణాత్మకమైన ప్రకృతికి వశుడై నా దేహమో, నా సంపదలో అంటూ నిత్యం లోకంలో తిరుగాడుతూ‌ ఉంటారు.  అలాంటి ఎరుకలేని వాడు తెలిసికొనేటట్లుగా నువ్వు ఈశ్వరుడైన శ్రీహరి యొక్క లీలలను తెలియ జెప్పాలి.

చ. తన కులధర్మమున్ విడచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము నొందక  యెవ్వడేనిఁ జ
చ్చిన మఱుమేన నైన నది సిధ్ధి వహించుఁ దదీయ సేవ బా
సినఁ గులధర్మగౌరవము సిధ్ధి వహించునె మెన్ని మేనులన్

మనుష్యులందరికీ లోకసహజంగా తమమమ జన్మవంశాలకి అనుగుణమైన వృత్తులూ‌ ధర్మాలూ యేర్పడుతున్నాయి.  వాటిని అన్నిటినీ దాటి, యెవ్వడైనా సకల దుర్గుణాలను అణచే (దుర్గుణాశ్రయులైన జీవులే రాక్షసులు) శ్రీహరి పాదాలను పట్టుకున్నాడో వాడి పంట పండినట్లే.  హరిసేవ మాత్రమే‌ కర్తవ్యం చేసుకుని జీవితం గడిపిన వాడికి సిధ్ధి కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఒక జీవితకాలంలో సిధ్ది కలగక పోవచ్చును. అయితేనేం మరొక జన్మలో కలుగుతుంది.  అలా కాక కులధర్మాలు అంటూ‌ పట్టుకుని వేళ్ళాడుతూ కించిత్తూ భగవద్భక్తి లేకండా జీవించే వాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఏమీ ముందుకు జరగడు.  వాడికి ఎన్నటికీ మోక్షమూ లేదు.  వ్యాసా, స్వధర్మాచరణమూ‌ భగవద్భక్తీ పరస్పర విరుధ్దాలు కావు. కర్మాచరణం చేసే వాడు తత్ఫలాలను తప్పక ఈశ్వరార్పణం చేయాలి కదా? భక్తి లేని వాడు ఈశ్వరార్పణం ఏం‌ చేస్తాడయ్యా?  భక్తి లభించిన వాడి వలన జరిగే కర్మలన్నీ ఈశ్వరారాధనలే అవుతున్నాయి కదా?  అందుచేత  జగదీశ్వరుని యందు అచంచలమూ నిష్కల్మషమూ అయిన భక్తి అన్నదే సర్వ ప్రధానమైనది.

అందుచేత ఏ మాత్రం ఎరుక కలిగినా, హరిసేవకోసం ప్రయత్నించాలి.  శరీరం అంటూ ప్రకృతిసిధ్ధంగా ఏర్పడినట్లే దానికి సుఖదుఃఖాలూ ప్రకృతిసిధ్దంగానే ఏర్పడుతున్నాయి.  బ్రహ్మలోకంలో ఉన్నా పాతాళంలో‌ ఉన్నా ఈ‌సుఖదుఃఖాలు తప్పవు కదా? అవునా?  అందుచేతా ఈ‌ సుఖదుఃఖాలను లెక్క చెయ్యకూదదు - హరిసేవనూ విడువకూడదు.  ఒకపట్టాన ఎరుక రానే‌ రాదు.  అతి కష్టం మీద లభించిన ఎరుకను హరిసేవకోసం వినియోగిస్తే కలిగే మేలే, జీవులకు అసలైన మేలు.  మనోవాక్కాయకర్మలా హరిసేవకుడై ఉండే వాడు అందరిలాగా ఈ‌ లోకంలో పుట్టి పెరుగుతూ ఉంటాడు.  కాని అందరిలా ప్రకృతిమాయకు వశం కాకుండా నిబ్బరంగా ఉంటాడు. హరిస్మరణంలో రుచి తెలుసుకున్న వాడు ఆ భక్తిరసప్రవాహంలో హాయిగా ఈదుతూ బయటకు రావటానికి ఇష్టపడనే పడడు.

సీ.  విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను
      వే ఱేమియును లేదు విశ్వమునకు
బవవృధ్ధిలయము లా పరమేశుచే నగు
      నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిగింపబడ్డది యేక దేశమున నీ
      భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము
      రమణతో హరి పరాక్రమము లెల్ల
అ.  వినుతిసేయు మీవు వినికియు జదువును
దాన మతులవయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభు బొగడఁ గలిగెదేని

ఈ కనిపించే ప్రపంచం అంతా విష్ణువే. ఈ‌ విశ్వం అంతా ఆ విస్ణువు ఆకారమే.  ఈ విశ్వం అనేది పుట్టటం, పెరగటం, నశించటం అంతా ఆ పరాత్పరుడైన విస్ణువు జరిపించే పనులే.  ఇదంతా నీకు చక్కగా తెలిసిందే‌ కదా!  నువ్వే ఈ విషయాన్ని నీ గ్రంథాలలో ప్రపంచజనులకు విశదీకరించావు కూడా.

ఈ విశ్వంలో ఒకా నొక చోట,  విశ్వక్షేమం కోసం, విష్ణువు యొక్క అంశలో జన్మించిన మహానుభావుడవు నువ్వు!  ఈ విషయాన్ని చక్కగా మనస్సులో అనుసంధానం చేసుకో.

ఇంక విష్ణుదేవుని యొక్క గొప్పదనాన్ని స్తోత్రం చేయవలసి ఉంది నువ్వు.  నీ పాండిత్యంతోనూ అనుభవంతోనూ నువ్వు గ్రహించినవీ, పెద్దలనుండి శ్రథ్థగా విని తెలుసుకున్నవీ అయిన విషయాలను స్మరించు. నీతి, తపస్సు, ధైర్యం, సంపదా అన్నీ విష్ణువు లోనే ఫలిస్తున్నాయి.  అన్నింటి సారమూ విష్ణువే.  విష్ణువుని స్తుతించటంలోనే అన్నింటికీ సార్థకత.

శ్రీనారదమహర్షులవారు ఇలా చేసిన ఉపదేశం‌ యొక్క సారం యేమిటంటే, విష్ణు లీలా విశేషాలతో గ్రంథరచన చేసి ప్రజానీకాన్ని ఉధ్ధరించమని.

28, జులై 2013, ఆదివారం

ప్రధమస్కంధం: 04. శ్రీవేదవ్యాస భగవానులవారి వద్దకు శ్రీనారదులవారు వచ్చుట

శ్రీవేదవ్యాసమహర్షులవారికి పరమానందం కలిగిస్తూ వారి వద్దకు బ్రహ్మమానసపుత్రులూ, హరిభక్తాగ్రగణ్యులూ, త్రికాలవేదీ, త్రిలోకాసంచారీ అయిన శ్రీనారదులవారు విచ్చేసారు.  వారి రాకను గూర్చి పోతనగారి పద్యం
సీ. తన చేతి వల్లకీ తంత్రీచయంబున
      సతతనారాయణ శబ్దమొప్పఁ
నానన సంభూత హరిగీత రవసుధా
      ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిల జటాభార కాంతిపుంజంబుల
      దిశలు ప్రభాతదీధితి వహింపఁ
దనులగ్న తూలసికాదామ గంధంబులు
      గగనాంతరాళంబు గప్పికొనఁగ
అ. వచ్చె మింతనుండి వాసవీనందను
కడకు మాటలాడఁ‌ గరుణ తోడ
భద్రవిమలకీర్తి పారగుఁ డారూఢ
నయవిశారదుండు నారదుండు

ఆ నారదమహర్షులవారి చేతిలోని వీణకు మహతి అని పేరు.  ఆ మహతీవీణ నుండి నిరంతరం నారాయణశబ్దం వినిపిస్తోంది.  ఆయను నారాయణుడి మీద కీర్తనలు గానం చేస్తూ వస్తుంటే, యోగీంద్రులందరికీ‌ ఎంతో‌ ఆనంద కలుగుతోంది వాటిని ఆలకిస్తూ.  రాగిరంగుకు తిరిగిన ఆయన జటాజూటపు కాంతులు దిక్కులను ఉదయారుణప్రభలతో‌ నింపివేస్తున్నాయి.  ఆయన దరించిన దివ్యమైన తులసిదండల నుండి వెలువడుతున్న సుగంధంతో భూమ్యాకాశాలూ అంతరాళమూ నిండిపోతున్నాయి.  అటువంటి దివ్యమైన ఆకారంతో, అద్భుతమైన కీర్తితో ప్రకాశిస్తున్న నారదమహర్షులవారు వ్యాసమహర్షిని చూడవచ్చారు.  ఆయన ఎంతో‌ కరుణతో వ్యాసులవారితో సంభాషించి వ్యాసులవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో వచ్చారు.

అల వచ్చిన నారదులవారు, దిగులుగా ఉన్న వ్యాసులవారిని చూసారు.  వారికి తెలుసు వ్యాసులవారు దేని గురించి చింతతో‌ ఉన్నదీ.  వ్యాసులవారి చేత సముచితమైన సత్కారాలు అందుకున్నారు.  ఆ తరువాత యథాప్రకారం చిన్నగా వీణానాదం చేస్తూ,  వ్యాసులవారి వంక చూసి ఇలా అన్నారు.

ఉ. ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాల వి
జ్ఞేతవు కామముఖ్యరిపుట్క విజేతవు బ్రహ్మతత్వ ని
ర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ కారణ మేమి పరాశరాత్మజా

ఓ వ్యాసా, ఏమిటయ్యా అలా దిగులు పడుతూ‌ కూర్చున్నావు?  ఇదేమన్నా బాగుందా?  అన్నీ తెలిసిన నీకు ఎందుకయ్యా ఈ విచారం? నీవు బ్రహ్మ అంతవాడివి కాదా - వేదాలను చక్కగా ఋక్, యజుస్, సామ, అధర్వ విభాగాలుగా నిర్ణయించి లోకానికి మహోపకారం చేసినవాడివి.  సకలవేదాలలోని సారభూతమైన సమస్తాన్ని నీ కన్నా చక్కగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతశ్శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యమూ అనే ఆరుగురు భయంకరమైన శత్రువులనూ జయించిన మహానుభావుడివి.  యోగులందరూ నాయకుడివి గురువు స్థానంలో‌ నిలబడిన వాడివి.  సకలనీతులనూ చక్కగా తెలిసినవాడివి.  అదేమిటయ్యా, నీ అంత వాడివి నువ్వే అనిపించుకున్న మహానుభావుడివి నువ్వేమిటీ, ఇలా దీనంగా ఉండటం యేమిటీ?  ఎందుకయ్యా నీకు విచారం?  కాస్త నాకు చెప్పు అసలు నీ‌ బాధ యేమిటో!

ఇలా శ్రీనారదులవారి సమాశ్వాసించటంతో శ్రీవేదవ్యాసులవారు మహదానందం చెందారు.

ఓ నారదమహర్షీ, నీవు సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మకు కుమారుడివి.  సర్వేస్వరుడైన శ్రీహరికి అత్యంత ప్రియభక్తుడివి. సకలలోకాల వృత్తాంతాలూ నీకు తెలుసు. భూతభవిష్యత్తులూ వర్తమానమూ నీకు తెలుసు. సూర్యుడంత ప్రభావం కలవాడివి.  అందరి మనస్సులూ తెలిసినవాడివి. మహానుభావుడవు. సర్వజ్ఞుడివి.  నా బాధ నీవు తెలిసికోగలవు.  అయినా నా యందు అనుగ్రహం చూపటానికి దయతో నన్ను అడుగుతున్నావు.  స్వామీ‌, నారదమహర్షీ, నా యందు దయచూపి, నా మనస్సులో ఏర్పడిన కొరతను నివారించండి. అని ఈ విధంగా నారదులవారికి వ్యాసులవారి విన్నపం చేసుకున్నారు.

అప్పుడు నారదులవారు చిరునవ్వుతో వ్యాసమహర్షికి ఇలా బోధించారు.

ఉ.  అంచితమైన ధర్మచయ మంతయిఁ జెప్పితి వందులోన నిం
చించుక గాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁ గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా

వ్యాసా, నువ్వు నీ గ్రంధాలన్నింటిలో విస్తారమైన ధర్మవిషయాలన్నింటి గురించి చక్కగా, విపులంగా బోధించావు. చాలా బాగుంది. తప్పకుండా చాలా మంచిపని.
అలాగే నీ‌ గ్రంథాలలో అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు ముక్తసరిగా భగవంతుడైన విష్ణుమూర్తిని గూర్చి చెప్పావు కూడా.  అదీ బాగానే ఉంది. 

కానీ, వ్యాసా, అలా ఊరికే ధర్మాలు ఏకరువు పెడితే లాభం ఏమిటీ?
కేవలం అక్కడక్కడా విష్ణుమూర్తిని గూర్చి ఒకటి రెండు ముక్కలు చెప్పి లాభం‌ ఏమిటీ?

ఊరికే ధర్మాధర్మాలగోలలో పడి విష్ణుగుణాను కీర్తనం చేయటం మీద మనసు పెట్టలేదు నువ్వు! గమనించావా?

ధర్మోపన్యాసాలతో భగవంతుడికి మెప్పు సంపూర్ణంగా కలుగుతుందటయ్యా? ఆయన అనంత కల్యాణగుణవిశేషాలను మనఃపూర్వకంగా స్తుతిస్తే కలుగుతుంది కానీ?

నీకు వచ్చిన ఈ‌ కొరత, ఈ‌ మానసిక గ్లాని అంతా నువ్వు కోరి శ్రీహరిని నుతించకపోవటం వల్లే వచ్చింది.

మరొకమాట. హరి నామ గానం చేసే కావ్యం ఏదైనా సరే, మానససరోవరంలా మహా పవిత్రమూ‌ సుందరమూ అవుతుంది.  హరినామం తలచని కావ్యం ఎంత గొప్ప కథా సంవిధానమూ, కవితా ప్రౌఢిమా, చమత్కారాలూ, అలంకారాలూ, శాస్త్రచర్చలూ వగైరా సరంజామాతో నిండి ఉన్నా అది చుట్టూ కాకులు మూగి రొదచేస్తున్న బురద గుంటలాంటి సుమా!

శ్రీహరి గుణనామ కీర్తనలతో శోభించే‌ కావ్యంలో ఒకవేళ ఇతరమైన గొప్పగొప్ప విషయాలు లేకపోయినా యేమీ ఫరవాలేదు.  చివరకు అక్కడక్కడా అపశబ్దాలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అటువంటి కావ్యం నిస్సందేహంగా మంచి కావ్యమే. అలా హరినామోపేతమైన కావ్యంతో సర్వపాపాలూ ప్రక్షాళనం అయిపోతాయి. 

అదయ్యా హరినామం గొప్పదనం.  అందుకే, సాధువులైన వాళ్ళు ఆ శ్రీహరి నామం మననం‌ చేసుకుంటూ, ఆ హరి నామాన్ని ధ్యానం చేసుకుంటూ,  ఆ హరి నామం కీర్తనలుకట్టి పాడుకుంటూ, అ హరినామాన్ని మనసారా పరవశంతో వింటూ ఉంటారు.  నిరంతరం వాళ్ళిలాగే ప్రవర్తిస్తూ ధన్యులౌతున్నారు.  ఇది సత్యం. ఇదే సత్యం.

వ్యాసా, నీవు తత్వం అంతా తెలిసినవాడివే. ఒక్క సారి నీవే‌ అలోచించి చూడు.  నేను చేసిన బోధలో సత్యం అంతా నీకే స్వయంగా అవగతం అవుతుంది!

26, జులై 2013, శుక్రవారం

ప్రధమస్కంధం: 03. శ్రీవేదవ్యాస భగవానులవారికి కలిగిన విచారం

ఆ సూతపౌరాణికులవారు మహర్షుల ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఉపక్రమించారు.

మహర్షులారా ద్వాపరయుగం చివరలో శ్రీహరియొక్క దివ్యకళతో శ్రీవేదవ్యాసభగవానులవారు అవతరించారు.  ఒకనాటి సూర్యోదయ సమయం. వ్యాసులవారు బదరికాశ్రమం దగ్గర సరస్వతీ పుణ్యనదీ జలాలలో స్నానం పూర్తిచేసుకున్నారు.  ఒంటరిగా కూర్చుని రాబోయే కలియుగం యెలా ఉంటుందో అందులో మానవజాతి ప్రవర్తన యెలా ఉంటుందో అని అనుకున్నారు. అది ఎంత ఘోరంగా ఉండేదీ వారి మనస్సుకు రాగానే వారికి ఎంతో విచారం కలిగింది.

ఎలా ఈ‌ మానవజాతికి హితం చేకూర్చాలీ‌ అని ఆలోచించారు.  కలియుగంలో మానవుల శక్తి స్వల్పం. బహు విస్తారంగా ఉండే వేదాన్ని అభ్యసించటం కలిలో మనుషులకు శక్తికి మించిన పని.  అందుచేత ఎంతో ఆలోచించి, మానవులకు సులభంగా ఉండటం కోసం ముందుగా వేదరాశిని నాలుగు విభాగాలుగా చేసారు.

వాటిలోఋగ్వేదాన్ని పైలుడనే మహర్షికి ఉపదేశించారు. అలాగే సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు.  యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు. అధర్వవేదాన్ని సుమంతుడికి ఇచ్చారు.

ఇలా వేదవిభాగాల్ని ఆయా ఋషీంద్రులు వ్యాసభగవానుల వలన గ్రహించి తమతమ శిష్యగణంద్వారా వాటిని మానవలోకంలో ప్రవర్తింప జేసారు.

అయితే ఇంకా ఒక చిక్కు మిగిలే ఉందని వ్యాసులవారు అనుకున్నారు.  వేదాలను అధ్యయనం చేసే అధికారం బ్రహ్మవేత్తలుగా ఉండే బ్రాహ్మణులకే తప్ప అన్యులకు లేదు.  అలాగే అబ్రాహ్మణులకే కాక,  స్త్రీలకూ వేదవిధ్యాధికారం లేదు. మరి వారికి ఏదీ అభ్యున్నతి కలిగేదారీ అని కరుణామూర్తులైన వేదవ్యాసులవారు ఆలోచించారు. 

అప్పుడు ఆయన చక్కగా మహాభారతాన్ని మానవులకు అందరికీ ఉపయుక్తం అయ్యేటట్లుగా నిర్మించారు.  ఈ మహాభారతం చెప్పే సందర్భంలో భగవానులు వేదార్థసారం అంతా దానిలో నిక్షేపించారు.  అందుకే, అది పంచమవేదంగా ప్రసిధ్ధి గడించింది. మహాభారతాన్ని అధ్యయనం చతుర్వర్ణాలవారూచేయవచ్చు.  స్త్రీలూ పురుషులూ అనే బేధం లేక అందరూ మహాభారతాన్ని అధ్యయనం చేసి మేలు పొందవచ్చు.

ఇదంతా మానవజాతిలో బుధ్ధిమంతులందరికీ చాలా సంతోషం కలిగించింది. ఋషిగణం అంతా ఆయనను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా గుర్తించి కీర్తించింది.

అయినా వ్యాసులవారికి సంతోషం కలగలేదు.  ఇంకా ఆ భగవానుల మనస్సుకు తృప్తిగా అనిపించలేదు.

మరలా ఒకనాడు ఒంటరిగా సరస్వతీ నదీ‌ తీరాన కూర్చుని తనలో తాను ఈ విషయమై చాలా బాధపడ్డారు.

ఎంతో‌ ఆలోచించగా, ఆయనకు ఒక విషయం బోధపడింది.

తాను ఎంతగా కృషిచేసి వేదవిభాగం చేసీ, మహాభారతం అనే గొప్ప ఇతిహాసం నిర్మాణం చేసీ కూడా, ఈశ్వరుడి మెప్పును మాత్రం ఇంకా పొందలేక పోయాడు.  అయ్యో,  శ్రీహరికీ, మహాయోగులకీ ఎంతో ఇష్టమైన భగవంతుని కథలను చక్కగా చెప్పలేదే నేను!  ఎంత మోసపోయానూ, ఎంత పొరపాటు చేసానూ! నాకు ఇన్నాళ్ళూ ఆ బుధ్ధి ఎందుకు కలగలేదూ అని చాలా చాలా విచారించారు.

ఇప్పుడు తనకు ఏమిటి కర్తవ్యం అని ఆయన ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది.

అప్పుడు వ్యాసులవారి వద్దకు శ్రీనారదమహర్షులవారు వచ్చారు.  శ్రీనారదులు బ్రహ్మమానసపుత్రులు.  వారు శ్రీహరికి పరమభక్తాగ్రగణ్యులు. సమస్తమూ తెలిసిన వారు.  ఆయన విచ్చేయటంతో వ్యాసభగవానులవారు పరమానంద భరితులయ్యారు.

వచ్చే టపాలో నారదులవారు వ్యాసులవారితో సంభాషించిన విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రథమస్కంధం:‌ 02. శ్రీమహాభాగవతం కథా ప్రారంభం

శ్రీమహాభాగవత పురాణం  మనకు అందివచ్చిన కథ నైమిశారణ్యంలో ప్రారంభం అవుతుంది. ఇది విష్ణుక్షేత్రం. ఇక్కడకు కలి పురుషుడు ప్రవేశించనే ప్రవేశించడు - అది అతనికి అసాధ్యం.  అందుచేత అక్కడ, శౌనకుడు మొదలయిన మహర్షులు, శ్రీమహావిష్ణువును చేరుకునేటందుకు గాను వేయేళ్ళపాటు సత్రయాగం చేసారు. ఆ యాగాన్ని చూడటానికి సూతుడు అనే గొప్ప ఋషిపుంగవులు వచ్చారు. ఆ సూతుడు గొప్ప పౌరాణికుడు.  అంటే భగవంతుని మాహాత్మ్యం వినసొంపుగా కథలుకథలుగా విపులంగా చెప్పే మహానుభావుడు.
ఒకరోజున మునులంతా ఆరోజుకు అవసరమైన యాగసంబంధమైన కార్యక్రమాలు ముగించుకుని సూతమహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు.

క. భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్తభీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరిగుణోపచిత భాషణముల్

ఓ సూతమహర్షీ, శ్రీహరి కథలు సరస్వతీదేవికి అలంకారాలు. ఆ కథలు పాపాలను పొడిపొడిగా నూరి పారేస్తాయి. ఆ కథలంటేనే మృత్యుదేవత గుండెలు అదిరిపోతాయి. అవి చెవుల బడగానే హరిభక్తుల గుండెలు ఆనందంతో ఎగిసిపడతాయి. ఆ కథలన్నీ జగత్కల్యాణం కలిగించేవి.

ఆ కథలు అత్యంత అద్భుతమైనవి.

సీ. హరికథాకథన దావానల జ్వాలచేఁ
      కాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచేఁ
      దొలఁగవే‌ భవదుఃఖ తోయదములు
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ
      గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిఁ
      దీఱవే షడ్వర్గ తిమిరతతులు
ఆ. నళిననయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు
వేయు నేల మాకు విష్ణుప్రభావంబు
దెలుపవయ్య సూత ధీ సమేత

మహాపాపాలనే‌ భయంకరమైన అరణ్యాలు హరికథలు అనే దావానలంతో‌ కాలిపోవే!
వైకుంఠవాసుని దర్శనం అనే ప్రచండ వాయువుతో జీవుల్ని ఈదులాడించి దుఃఖపెట్టే ఈ భవసముద్రం‌ ఇంకిపోదా?
విష్ణు ధ్యానం అనే‌ మహాసింహం దెబ్బకి ఏనుగు లంతేసి ఉండే రకరకాల కష్టాలూ కూలిపోవా?
నారాయణస్మరణం అనే సూర్యరశ్మికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే చీకట్లు విచ్చిపోవా?
విష్ణుభక్తి అనే‌ నావనెక్కి తప్ప భవసముద్రం దాటలేము గదా.

ఓ సూతమహర్షీ అందుచేత మాకు శ్రీమహావిష్ణువు ప్రభావం గురించి విశరీకరించి చెప్పవయ్యా అని అడిగారు.

ఆ సూతమహర్షికి ఆనందం‌ కలిగింది ఈ‌ పరిప్రశ్నకి.  ఆయన మునులతో ఇలా అన్నారు.


ఆ. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుఁ డెవ్వడేఁని  మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగి పోవు

చాలా సంతోషం. ఈ విష్ణుకథలున్నాయే అవి చాలా రహస్యమైనవి.  అంటే శ్రథ్తాభక్తులు గలవారు శ్రధ్ధాభక్తులు గలవారిని ఆశ్రయిస్తే కాని తెలుసుకోవటానికి సులువుగా దొరకనివి. సంపూర్ణమైన భక్తితో, ఏ మానవుడైతే, నిత్యమూ వాటిని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో వాడు ధన్యుడు.  వాడికి ఇక సంసారం అనే దుఃఖం లేకుండా పోతుంది.
 
మహాత్ములారా,  వినండి. సాక్షాత్తూ విష్ణుస్వరూపులే ఐన వ్యాసభగవానులవారు తెలుసు కదా? ఆయన శ్రీమహాభాగవతం అనే పేరుగల అద్భుతపురాణాన్ని నిర్మించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే!  దానిని మొదట వ్యాసులవారు తమ కుమారుడైన శుకయోగీంద్రులచేత చదివించారు.  ఆ‌ శుకమహర్షి దానిని పరీక్షిత్తు అనే మహారాజుకు ఉపదేశం చేసారు. ఆ పరీక్షిత్తు పాండవుల మనుమడు.  ఆయన గంగ ఒడ్డున ప్రాయోపవేశ దీక్షలో ఉండగా శ్రీశుకులు వచ్చి ఆయనకు భాగవతం చెప్పారు. అప్పుడు నేనూ అక్కడ ఉండి అంతా భక్తితో‌ ఆలకించాను.  ఆ భాగవతాన్ని మీకు వినిస్తాను.

ఆ మునిశ్రేష్ఠులందరికీ ఆశ్చర్యం‌ కలిగింది. సూతుణ్ణి ఇలా అడిగారు.

మహాత్మా, ఆ శుకయోగీంద్రులు మహా యోగి అని చెబుతారే.  అయనకు కనీస స్త్రీపురుష బేధ దృష్టీ లేదు కదా!  ఆయనగురించి ఒక కథ విన్నాం.  

ఒకసారి శుకుడు గోచీగుడ్డకూదా లేకుండా దిస్సమొలతో అడవిలో పోతూ ఉంటే వ్యాసులవారు వెనక వెతుకుతూ వెళ్ళారు.

ఆ అరణ్యంలో ఒక కొలనులో‌ దేవకన్యలు జలకా లాడుతున్నారు.

శుకుడు ఆ కొలను గట్టు మీద నుండి పోతూ ఉండగా చూసి ఆ కన్యలంతా ఆ మహానుభావుడికి నీళ్లలో నుండే నమస్కారాలు సమర్పించుకున్నారు.

ఇంతలోనే కుమారుడి వెనకాలే నాయనా నాయనా అని పిలుస్తూ వెతుక్కుంటూ వ్యాసమహర్షులవారు వస్తున్నారు.  వారిని చూసి సిగ్గుపడి గాభరాగా ఆ కన్యలు బట్టలు వేసుకుని కొలను వెలువడి ఆయనకు మ్రొక్కారు.

వ్యాసులవారు అమ్మాయిలూ మీరు మా శుకుణ్ణి గాని చూసారా అని ఆడిగారు.

వారన్నారూ, మహాత్మా శుకులవారు ఇంతకు ముందే ఈ దారిన వెళ్ళటం కొలనిలోనుండి అందరం చూసాం అని.

వ్యాసులవారికి ఆశ్చర్యం కలిగింది. అమ్మాయిలూ, నన్ను చూసి మీరు నీళ్ళల్లోంచి బయటికి వచ్చి బట్టలు వేసుకున్నారు.  ముసలి వాడిని నన్ను చూసి సిగ్గుపడ్డారే!  నవయువకుడు, అందగాడు అయిన మా శుకుడిని,  ఒంటిమీద నూలుపోగు లేకుండా వస్తూ ఉన్నవాడిని చూసి, మీకు సిగ్గువేయలేదా అని వారిని వ్యాసులవారు అడిగారు.

అప్పుడు ఆ దేవకన్యలు వ్యాసమహర్షితో,  ఇలా అన్నారు. మహాత్మా,  అతడు నిర్వికల్పుడయ్యా. అతడికి స్త్రీలూ పురుషులూ‌ అన్న బేధం కూడా ఏ మాత్రం లేదు.  అందుచేత అతడి కంట మేము పడినా మేము స్త్రీలమూ తాను పురుషుడనూ అన్న భావన లేశమూ లేని వాడైన ఆ శుకుణ్ణి చూసి సిగ్గు పడవలసింది యేమీ‌లేదు. మీకూ వారికీ‌ చాలా పెద్ద బేధం ఉంది.  అతడు కేవలం పరబ్రహ్మ స్వరూపుడు. 

ఎంత అద్భుతమైన విషయం. ఆహా, ఆ శుకయోగీంద్రులు మహాయోగి, సమదర్శనుడు, మాయను జయించినవాడు, ఆనందస్వరూపుడూ‌ కదా!

అలాంటిది, ఆ శుకయోగీంద్రులు హస్తినాపురం వెళ్ళారా? ఎక్కడా కూడా, అవుపాలు పితికేటంత సమయం ఐనా నిలువని ఆ  మహాత్ముడు పరీక్షిత్తుకి పురాణం వినిపించారా రోజుల తరబడి? ఆ పరీక్షిత్తుకూడా మహాధర్మాత్ముడని విన్నాం. ఆయనకు ఏమి కష్టం వచ్చింది స్వామీ‌, రాజ్యంగీజ్యం వదిలేసి గంగ ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలటానికి?

సూతపౌరాణికులవారు చిరునవ్వుతో, అంతా చెబుతాను వినండి, అన్నారు.

ప్రథమస్కంధం: 01. పోతనగారు భాగవత రచనకు పూనుకోవటం

శ్రీమధ్బాగవత పురాణాన్ని మనకు అందించిన మహానుభావులు వేదవ్యాసమునీంద్రులు. వేదవ్యాసులవారు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమూర్తులలో ఒకరు.  ఈ‌ విషయం భాగవతంలోనే స్పష్టంగా ఉంది.

సంస్కృతభాషలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అందించిన భాగవతోత్తములు పోతనామాత్యుల వారు. ఆపాతమధురమైన కవితాధార పోతన్నగారి సొత్తు. ఆయనది సహజపాండిత్యం.  శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతనగారి ఆంద్రమహాభాగవతగ్రంధం ప్రతి తెలుగు యింటనూ తప్పక ఉండవలసిన పుణ్యగ్రంధం.  ఆ మహర్దివ్యగ్రంథాన్ని ఇంట నుంచు కున్న అదృష్టవంతులకు భగవత్కృప అపారంగా లభిస్తుంది.  పారాయణం చేస్తే అది సాక్షాన్ముక్తి ప్రదాయకమే.

భగవంతుని దివ్యలీలావిలాసాలను సంపూర్ణంగా తెలుసుకోగలగటం కేవలం‌ అసాధ్యం.  భగవంతుని తెలియగలవాడు వేరొకడు ఎవ్వడూ ఉండడు.  పోతన్నగారు అందుకే ఇలా అన్నారు

ఆ. భాగవతముఁ దెలిసి పలుకుట శక్యమే
శూలికైనఁ తమ్మి చూలికైన
విబుధవరుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత తేట పఱతు

సాక్షాత్తూ బ్రహ్మశివులకైన సంపూర్ణంగా భగవత్తత్వం‌ అవగాహన కాదే‌ అంటే నేనెంత? ఏదో‌ పెద్దలవలన తెలుసుకున్నది నాకు అర్థమైనది అయినట్లుగా తెలియజేస్తాను అన్నారీ‌ పద్యంలో పోతనగారు.  

ఆయన గురించి కొంచెం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

పోతనామాత్యుడను అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన నియోగి బ్రాహ్మణులు.  వారిది కౌండిన్య గోత్రం, ఆపస్తంబ సూత్రం. భీమన మంత్రి,  కుమారుడు అన్నయ మంత్రి.  అన్నయ, గౌరమాంబల పుత్రుడు సోమన. సోమన, మల్లమ్మల కుమారుడు ఎల్లన.  ఎల్లన మాచమ్మల కుమారుడు పోతనగారి తండ్రిగారు కేతన

ఆ. లలితమూర్తి బహుకళానిధి కేతన
దాన మాన నీతిధనుడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ
మనియె శైవశాస్త్రమతముఁ గనియె

కేతనగారు సౌమ్యులు. మంచి విద్యావంతులు. నీతిపరులు, దానశీలురు. ఆయనభార్య లక్కమాంబ. (వారి కుమారుడే పోతనామాత్యుడు)

పెద్దల పేర్లను బట్టి చూసినా, పై పద్యాన్ని గమనించినా పోతన్నగారి వంశీకులు శివారాధనా తత్పరులని అర్థం‌ అవుతోంది గదా?  శివారాధనాతత్పరులైన పోతనగారు తనది పరమేశ్వర కరుణా కలిత కవిత అని చెప్పుకున్నారు వినయంగా.  వారికి శివకేశవలు ఇద్దరూ సమానమే. ఆయన హరిహరుల చరణారవిందాలకు సమంగా మ్రొక్కే విబుధులు.

తన వేయి జన్మల తపస్సు ఫలితంగా తనకు శ్రీమన్నారాయణుడి కథాప్రపంచం అయిన శ్రీమధ్బాగవతం ఆంద్రీకరించాలనే కోరిక పుట్టింది.  అది ఆంద్రుల అదృష్టం. ఆంద్రజాతి చేసుకున్న పుణ్యఫలం.


ఒకరోజున పోతనగారు నదీస్నానం చేసి, మహేశ్వర ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన కన్నులు అరమోడ్పుగా ఉన్నాయి. శివధ్యానంలో మైమరచి ఉన్న పోతనామాత్యులకు ఒక అద్భుతమైన దర్శనం కలిగింది.

సీ. మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండలసుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిరునవ్వు మొలుచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
      బలువిల్లు మూఁపున బరగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము దలఁ గలుగువాఁడు

ఆ. పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁ‌గవకు నెదురఁ‌ గానఁబడియె

ఆ కనిపించిన మహారాజ మూర్తి యెలా ఉంది? మేఘంలా తానూ మెరుపులా తన పత్నీ ప్రకాశిస్తున్నారట.  అంటే సీతమ్మతో కూడి రామభద్రులు విచ్చేసారన్న మాట. ఆయన ముఖ చంద్రమండలం నుండి చిరునవ్వు అనే‌ అమృతం వర్షిస్తోంది.  ఒక పెద్ద నల్లని కానుగ చెట్టును అంటి ఉన్న లతలాగా ఒక పెద్దవిల్లు ధరించి ఉన్నాడు.  పెద్ద నల్లని కొండశిఖరం మీద ఉన్న సూర్యబింబంలా ఆయన నెత్తిన పెద్ద అందకిరీటం.  తామరరేకుల వంటి అందమైన కళ్ళు. వెడల్పైన వక్షస్థలం.  ఎంతో మంగళకరమైన స్వరూపం.

పోతన్నా, నేను శ్రీరామచంద్రుడి నోయీ. శ్రీమహాభాగవతం తెలుగు చేయి. నాకు అంకితం ఇవ్వు. నీకు మోక్షం కలుగుతుంది అని అనుగ్రహభాషణం చేసి ఆ దివ్యమూర్తి అదృశ్యు డయాడు.

పోతన్నగారి పరవశం వర్ణనాతీతం. సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే అనుజ్ఞ దయచేసారు. ఇంకేమి కావాలి తనకు?
అందుకే ఆయన అన్నారిలా

క. పలికెడిది భాగవత మట
పలికించు విభుండు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగు నఁట
పలికెద వేఱొండుగాథ పలికఁగ నేలా

పలికేది భాగవతంట. అది నా నోట పలికించే ప్రభువు రామభదుడే నట! పైగా భాగవతం చెబితే ఇంక చావుపుట్టుకలు లేక మోక్షమే‌ నట.  ఇంక వేరే చెప్పాలా, భాగవతం కాక?

ఆ భాగవతాన్ని తాను ఎలా తన కవిత్వంలో చెప్పదలచుకున్నదీ పోతనగారు సెలవిస్తున్నారు

క. కొందఱకు దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱకు గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్

కొందరికి తెలుగు కవిత్వం ఇష్టం. కొందరికి సంస్కృతంలో ఉంటే బాగా నచ్చుతుంది. కొందరికి  రెండూ యిష్టమే. సందర్భాన్ని బట్టి నా కవిత్వంతో‌ అందరినీ మెప్పిస్తాను.

భాగవతాన్ని తెనిగించే అదృష్టం సామాన్యమైనది కాదూ, నన్నయ తిక్కన వంటి మహాకవులు దీనిని నాకు వదిలి పెట్టటం నా పూర్వ జన్మల పుణ్యఫలమేనూ‌ అనుకున్నారు.  ఇది చేస్తాను, ఇంక పునర్జన్మ లేకుండా తరిస్తానూ అని సంతోషం వెలిబుచ్చారు.

ఆ భాగవత ప్రశస్తి ఎట్లాంటిదో పోతనగారి మధురపద్యంలో ఇలా పలికింది

మ. లలితస్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై

ఈ భాగవతం ఒక కల్పవృక్షం. దీని శాఖలు ఎంతో‌ అందంగా ఉన్నాయి. మహాభాగవతులనే చిలకలు ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఆలాపనలు చేస్తున్నాయి. అందమైన లతలకు ఆశ్రయమైనది. అందమైన దేవతలు దీని మాహాత్మ్యం తెలిసి ఆశ్రయిస్తున్నారు. అద్భుత మైన చరిత కలది.  దీని ఫలాలు అద్బుతాలు. ఎంతో విశాలమైన మొదలు కలది. ఇలా ఒక వృక్షంగా అన్వయం.  మరొకరకంగా చూస్తే, ఈ‌ భాగవత గ్రంధంలో విభాగాలైన స్కందాలు చాలా పసందుగా ఉంటాయి - వివిధ శాస్త్రశాఖలను బాగా సమన్వయం చేస్తూ‌ ఉంటాయి. ఈ‌భాగవతానికి మూలమైనది శ్రీకృష్ణతత్వం. ఈ తత్వా న్ని హాయిగా వినిపించినది శ్రీశుకయోగీంద్రులు. ఎందరో‌భగవధ్బక్తుల చరిత్రలు ఈ‌భాగవతవృక్షాన్ని లతల్లాగా ఆశ్రయించి తరించాయి.  మంచి మనస్సు గలవారికి చక్కగా బోధపడే లక్షణం గలది భాగవతం. దీనిని ఆశ్రయించిన వారికి ఫలం మోక్షమే. ఈ భాగవత పురాణానికి పాదు వ్యాసమునీంద్రులు. 

ఎంత అందమైన పద్యం!

శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు.

పాఠక మహాశయులారా!

శ్రీ కష్టేఫలే శర్మగారి సూచన మేరకు భాగవతం టపాల కోసం కొత్త బ్లాగు తెరవటం జరుగుతోంది.

ఇలా చేయటం వలన భాగవతం టపాలన్నీ పాఠకులకు ఎక్కువ అందుబాటులో ఉంటాయని భావన.

ఇప్పటిదాకా శ్యామలీయం బ్లాగులో వచ్చిన కొద్ది భాగవతం టపాలు కూడా ఈ కొత్త ఈ కొత్త  శ్యామలీయం భాగవతం బ్లాగులో పునఃప్రకటితం చేయటం జరుగుతుంది.

ఇక మీదట శ్యామలీయం బ్లాగులో భాగవతం‌ టపాలు ప్రకటించటం జరగదు.

దయచేసి పాఠకులు అందరూ ఈ మార్పును గమనించ వలసిందిగా నా ప్రార్థన.

స్వస్తిరస్తు.